బైబిల్ పార్టీ కావాలా..భగవద్గీత పార్టీ కావాలా?

Update: 2021-01-04 14:27 GMT

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత వరకూ ఏ రాజకీయ నాయకుడు చేయని రీతిలో బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత కావాలా తిరుపతి ప్రజలు తేల్చుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతమవ్వబోతున్నాయని జోస్యం చెప్పారు. ఏపీ హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన ఆయన.. వైసీపీ రెండు కొండలు అంటోందని.. 'ఏడు కొండలవాడా గోవిందా గోవిందా' అనేది బీజేపీ సిద్ధాంతమన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం‌ కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు.

వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామన్నారు. ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు.‌ హిందువుల కానుకలను దారి మళ్ళిస్తోందని ఆరోపించారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దేవాలయాలపై దాడులకు ఏపీ సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పోరాటానికి సిద్ధమవుతుందని, తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యకర్తలు బలవంతులని పేర్కొన్నారు.

Tags:    

Similar News