తుమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2021-12-27 14:52 GMT

టీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తాజాగా కొంత పార్టీ నాయ‌కుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొంత మంది పార్టీని నాశ‌నం చేయాల‌ని చూశార‌న్నారు. అయినా పార్టీ ప‌రువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించార‌ని వ్యాఖ్యానించారు. సోమవారం అశ్వారావుపేటలో ఎమ్మెల్సీ తాత మధు అభినంధన సభ నిర్వహించారు. ఈ సభలో తుమ్మల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గాభివృద్ధి చేసే బాధ్యత తనదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.తాను మంత్రిగా ఉన్నప్పుడు అవకాశం వచ్చిన సందర్భంలో అశ్వారావుపేట అభివృద్ధి విషయంలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వేశా. భారతదేశంలో ఫామ్ ఆయిల్ హబ్‌గా అశ్వారావుపేట దమ్మపేట మండలాలు ఉండబోతున్నాయ‌న్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అశ్వారావుపేట సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా. భవిష్యత్‌లో కూడా అందరం కలిసి ప్రయాణం చేయాలి'' అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్సీ తాతా మ‌ధు మాట్లాడుతూ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పార్టీలోకే వ‌చ్చాకే జిల్లాలో టీఆర్ఎస్ బ‌లోపేతం అయింద‌ని అన్నారు. త‌న గెలుపు ఉగాది ప‌చ్చ‌డిలా కొంత మంది తీపి...కొంత చేదు ఉంద‌న్నారు. పార్టీకి కొంత మంది వెన్నుపోటు పొడిచార‌ని వ్యాఖ్యానించారు.ఇలాంటి వారి వ‌ల్లే గ‌తంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు లాంటి వారు కూడా ఓడిపోవాల్సి వ‌చ్చింద‌న్నారు.

Tags:    

Similar News