రైతుల భారత్ బంద్ కు కెసీఆర్ మద్దతు

Update: 2020-12-06 05:28 GMT

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ నెల 8న రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు మద్దతు ప్రకటించారు. దీనికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతానికి టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ శివార్లలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి పలు ఇతర దేశాల నేతలు కూడా మద్దతు ప్రకటించటం కేంద్రంలోని సర్కారును ఇరకాటంలోకి నెడుతోంది.

Tags:    

Similar News