
కాంగ్రెస్ పార్టీలో తాను చేరటం కంటే ఆ పార్టీలో సంస్థాగతంగా, నాయకత్వపరంగా ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఆయన కాంగ్రెస్ లో చేరటానికి తిరస్కరించిన అంశాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్లో సాధికారిక కార్యాచరణ గ్రూప్ (ఈఏసీ) 2024 సభ్యుడిగా చేరి, ఎన్నికలకు బాధ్యత వహించాలనే ప్రతిపాదనకు కూడా ఆయన నో చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చే ప్రత్యేక బాధ్యతలు తనకొద్దని, వాళ్ల చట్రంలో తాను ఇమడలేనని పేర్కొన్నారు.
వ్యవస్థాగతంగా లోతైన సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తనకన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరం అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్లో తాను చేరడం, చేరకపోవడం అంత ముఖ్యం కాదని, కాంగ్రెస్లో పూర్తిగా పునర్వ్యవస్థీకరణ జరగడం ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు రాకపోతే ప్రయోజనం లేదని అన్నారు. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనన తాను తిరస్కరించినట్టు తెలిపారు.