చంద్ర‌బాబు కంట‌త‌డి బాధాక‌రం

Update: 2021-11-19 15:18 GMT

ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు చోటుచేసుకున్న పరిణామాల‌పై జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ఈ ప‌రిణామాలు రాజ‌కీయాలు అంటే ప్ర‌జ‌ల‌కు ఏహ్య‌భావం క‌ల్పించేలా ఉన్నాయ‌న్నారు. రాజ‌కీయ నేత‌ల కుటుంబ సభ్యులను కించపరచటం తగదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయ‌న ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఉన్నారని పవన్ విమర్శించారు. ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కంట తడి పెట్టడం బాధాకరమని పవన్ అన్నారు. ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు, చివరికి టీవీ చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోందని పవన్ మండిపడ్డారు.

ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయమన్నారు. ఈ వ్యాఖ్యలు నిర్హేతుకంగా ఖండించదగినవని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబసభ్యులను తక్కువచేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలో ఖండించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని పవన్ అన్నారు. ముఖ్యంగా ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుందని పవన్ తెలిపారు. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు హాని కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లేని పక్షంలో ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని, రాజకీయ వ్యవస్థను ప్రజల దృష్టిలో పలుచన చేయవద్దని ఈ సందర్భంగా కోరుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News