హైదరాబాద్ పేరు మారిస్తే అంతా అయిపోతుందా?

Update: 2020-11-27 15:55 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణనే కాకుండా ఏపీని కూడా మోసం చేసిందని తెలంగాణ మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు కావాలంటే దమ్మున్న లీడర్ కావాలన్నారు. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలి. ప్రతి ఒక్కరు ఓటేయాలి. ఓటేయనివారికి ప్రశ్నించే హక్కు లేదని కెటీఆర్ వ్యాఖ్యానించారు. బిజెపి నేతలు హైదరాబాద్ పేరు మారుస్తామని అంటున్నారు. హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారిస్తే ఏం అవుతుంది. నేమ్ చేంజర్స్ కావాలా గేమ్ చేంజర్స్ కావాలో ఆలోచించుకోండి అని వ్యాఖ్యానించారు. 'అభివృద్ధితో కూడిన హైదరాబాద్ కావాలో.. కర్ఫ్యూతో కూడిన‌ హైదరాబాద్ కావాలో ఆలోచించుకోవాలి. కేంద్రమంత్రులు కూడా ప్రచారానికి వస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు ఎవరు కనపడలేదు. వాళ్లకు హైదరాబాద్ బిర్యాని తినిపిద్దాం.. ఇరానీ చాయ్ తాపిద్దాం. కరోనా సమయంలో ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు. ఎక్కడికి పోయాయో చెప్పాలి. నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు.' అని విమర్శించారు. కెటీఆర్ శుక్రవారం నాడు రియల్ ఎస్టేట్ సదస్సులో మాట్లాడారు.

'మేం అధికారంలోకి వచ్చే నాటికి రియల్ ఎస్టేట్ ఎలా ఉందో అందరికి తెలుసు. ఆరేళ్లలో ఎన్నో సంస్కరణలు చేశాం. ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు పోయాం. పెద్ద సంస్కరణలు తెచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. మీ‌ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను. మీ సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాను. తెలంగాణలో భూముల డిజిటల్ సర్వే చేస్తాం. దీన్ని మిగతా రాష్ట్రాలు కాపీ కొడతాయి' అని వ్యాఖ్యానించారు. 'ఒకప్పుడు శివారు ప్రాంతాల్లో పదిహేను రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఒకరోజు తప్పించి మరో రోజు వస్తున్నాయి. నాలా, మూసీ, డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన‌ చేస్తాం. హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమరాలు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ని కూడా అదుపులో ఉంచాం. నేడు తెలంగాణ-ఆంధ్రా, హిందూ-ముస్లిం గొడవలు లేవు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవు. కానీ మా రాజకీయ ప్రత్యర్థులు మాటలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ఒకాయన సర్జికల్ స్ర్టైక్ గురించి మాట్లాడుతారు. హిందూ-ముస్లింల‌ మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News