తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ

Update: 2020-09-07 08:55 GMT

తొలి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సంతాపాలతోనే ముగిశాయి. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి నివాళులు అర్పిస్తూ సీఎం కెసీఆర్ సభలో తీర్మానాలు ప్రవేశపెట్టారు, కరోనా కారణంగా పలు భద్రతా చర్యలు తీసుకుని సమావేశాలకు ఏర్పాట్లు చేశారు. శాసనసభ సమావేశ మందిరంలోనూ, బయటా భౌతిక దూరానికి ప్రాధాన్యతిస్తూ సభ్యులు, ఇతరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులతో పాటు సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. నెగెటివ్‌గా వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సభ ప్రారంభమైన తర్వాత శాసన స్పీకర్‌ పోచార శ్రీనివాస్‌ రెడ్డి సభ్యులకు కోవిడ్‌ నియంత్రణ జాగ్రత్తలు చదివి వినిపించారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సభ్యులు ఇంటి దగ్గరే ఉండాలని చెప్పారు.

సభ్యులందరూ తప్పనిసరిగా మాస్క్‌ లు ధరించాలని అన్నారు. శానిటైజర్లను తరుచూ ఉపయోగిస్తూ ఉండాలని సూచించారు. సభ్యుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు లిఫ్ట్‌ ను వాడవద్దని స్పీకర్‌ కోరారు. మాజీ రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ​‌ మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సీఎం కెసీఆర్ మాట్లాడుతూ దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించడంతో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణతో ప్రణబ్‌కు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ఎన్నో రాజకీయ సంక్షోభాలను ప్రణబ్‌ పరిష్కరించారని కొనియాడారు. నమ్మిన విలువలకు నిలబడిన వ్యక్తి ప్రణబ్‌ ముఖర్జీ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Similar News