అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ ప్రక్షాళన చేయలంటూ 23 మంది సీనియర్ నేతలు రాసిన లేఖపైనే హాట్ హాట్ చర్చ సాగింది. ఈ లేఖ పై సోనియాతోపాటు రాహుల్ గాంధీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఖ రాసిన సమయం..సందర్భంగా ఏ మాత్రం సరికాదని సోనియా, రాహుల్ లు అభిప్రాయపడ్డారు. సోనియా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవటానికి రెడీ కాగా..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు అంటోనీ వంటి సీనియర్ నేతలు వారించారు. సోనియా లేదా రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపట్టాలని కొంత మంది నేతలు ప్రతిపాదించారు. అయితే తుది నిర్ణయం తీసుకునే వరకూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియానే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం వివరాలను పార్టీ నేతలు మీడియాకు వివరించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలెవరిపైనా ఎలాంటి చర్యలూ ఉండవనీ, వారంతా తమ కుటుంబంలో భాగమని సోనియా వెల్లడించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబమని, పలు సందర్భాల్లో ఎన్నో విభేదాలు ఎదురైనా చివరికి తామంతా ఒక్కటిగా నిలిచామని సమావేశం చివరిలో సోనియా పేర్కొన్నారని సుర్జీవాలా చెప్పారు. దేశంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతం పార్టీ శ్రేణుల ముందున్నదని ఆమె చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్గా సోనియా గాంధీ కొనసాగుతారని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.
నూతన అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకూ ఆమె మరికొన్ని నెలల పాటు పదవిలో కొనసాగుతారని వెల్లడించారు. పార్టీ తాత్కాలిక చీఫ్గా సోనియానే కొనసాగాలని పార్టీ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని అన్నారు. బీజేపీతో కలిసి కుట్రపూరితంగానే పార్టీ ప్రక్షాళన కోరుతూ సోనియాకు లేఖ రాశారని రాహుల్ సీనియర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. తర్వాత ఇరుపక్షాలు సర్దుబాటు ప్రకటనలు చేసి సమావేశాన్ని ముగించేశారు.