కరోనా వైరస్ ముందు ఎవరికీ మినహాయింపులు ఉండవు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొలుత కరోనా బారిన పడి మృత్యువు అంచుల వరకూ వెళ్లొచ్చారు. తర్వాత ఎంతో మంది ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దేశంలో కరోనా బారిన పడిన తొలి ముఖ్యమంత్రి ఈయనే.
గత రెండు రోజులుగా తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎంకు పాజిటివ్గా తేలడంతో ఆయనతో సమీపంగా మెలిగిన వారంతా తీవ్ర ఆందోళన లో పడ్డారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ని కలిసిన అధికారులు, మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.