కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని పీ వీ నరసింహరావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్ధం ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ గౌరవార్థం తపాళా బిళ్లను విడుదల చేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కోరినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. తన విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకొని పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు.
ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సమాచార శాఖ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీవీ దూర దృష్టి, సంస్కరణలు, సౌత్ ఈస్ట్ ఆసియాతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేశాయన్నారు. ఆయన చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలపాలన్న యోచనతోనే పీవీ పోస్టల్ స్టాంప్ విషయంలో చొరవ చూపినట్లు పేర్కొన్నారు.