రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం

Update: 2020-06-17 11:20 GMT

చైనాకు భారత ప్రధాని నరేంద్రమోడీ ఘాటైన హెచ్చరిక చేశారు. భారత్ శాంతినే కోరుకుంటుందని..అంత మాత్రాన రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భారత్-చైనా సరిహద్దులో చోటుచేసుకున్న ఘటనలపై ఆయన స్పందించారు. ‘మన జవాన్ల త్యాగం వృథా కాదని దేశానికి హామీ ఇస్తున్నాను. భారత్‌ సార్వభౌమాధికారంపై రాజీ పడే ప్రసక్తే లేదు. భారత్‌ శాంతిని కోరుకుటుందని.. కానీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అందుకు తగ్గ సమాధానం ఇవ్వగలదు’ అని మోడీ పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవానులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు.

బుధవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో పాల్గొన్న మోదీ.. లేచి నిలబడి రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్న హోం మంత్రి అమిత్‌ షా, సీఎంలు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అమర జవాన్ల త్యాగాన్ని చూసి దేశం గర్విస్తోందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు మోదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మోడీ సరిహద్దులోని పరిస్థితిని పార్టీల నేతలకు వివరించే అవకాశం ఉంది.

Similar News