జమ్మూలో నేతలకు విముక్తి

Update: 2019-10-02 10:44 GMT

కీలక పరిణామం. జమ్మూలో ఆంక్షల సడలింపు. ఎప్పటి నుంచో ప్రజలు ఎదురుచూస్తున్నది దీని కోసమే. స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో జమ్మూలో గృహనిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను బుధవారం విడుదల చేశారు. వీరిపై నెలకొన్న నియంత్రణలనూ అధికారులు ఎత్తివేశారు. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు ప్రకటించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా, ఫరూక్‌ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

తాజా నిర్ణయంతో దేవేందర్‌ సింగ్‌ రాణా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌) హర్షదేవ్‌ సింగ్‌ (నేషనల్‌ ప్యాంథర్స్‌ పార్టీ) రామన్‌ భల్లా (కాంగ్రెస్‌) సహా పలువురు నేతలు బుధవారం విడుదలయ్యారు. స్ధానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు రాజకీయ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ విడుదల చేయాలని జమాతే ఇస్లామి హింద్‌ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. జమ్ము కశ్మీర్‌లోని 310 బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిళ్లకు అక్టోబర్‌ 24న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News