Telugu Gateway
Latest News

అరిచి కేకలు పెట్టే అర్ణబ్ గోస్వామి అడ్డంగా బుక్కయ్యారు

అరిచి కేకలు పెట్టే అర్ణబ్ గోస్వామి అడ్డంగా బుక్కయ్యారు
X

రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవీ

వివరాలు వెల్లడించిన ముంబయ్ పోలీసు కమిషనర్

అర్ణబ్ గోస్వామి. మీడియా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో కూడా అర్ణబ్ గోస్వామిపై వచ్చినన్ని కామెడీ పోస్టులు బహుశా ఎవరి మీదా వచ్చి ఉండవు. దేశంలో సమస్యలు అన్నింటిపై నిలదీస్తాను..నిగ్గదీస్తాను..ప్రశ్నిస్తాను..పరిష్కరిస్తాను అనే ఈ టాప్ జర్నలిస్ట్ కు చెందిన ఛానల్ రిపబ్లిక్ టీవీ ఇప్పుడు టీఆర్ పి రేటింగ్ మోసానికి పాల్పడిననట్లు గుర్తించారు పోలీసులు. ఈ విషయాలను ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ముఖ్యంగా అర్ణాబ్ గోస్వామి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంపై...ముంబయ్ పోలీసులపై..శివసేన నేతలపై కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున డిబేట్స్ నిర్వహించటంతోపాటు వార్తలు ప్రసారం చేశారు. ఈ తరుణంలో ఛానల్ రేటింగ్ ఫ్రాడ్ లో దొరకటం విశేషం. రిపబ్లిక్ టీవీ తోపాటు ముంబయ్ కు చెందిన రెండు లోకల్ ఛానళ్ళు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. టీఆర్ఎపీలను పర్యవేక్షించేందుకు ముంబయ్ లోని ఓ ప్రాంతంలో బార్క్ 2000 బారో మీటర్స్ ను ఏర్పాటుచేసింది.

ఈ మీటర్లు ఏర్పాటుచేసిన ప్రాంతంలో ప్రజలు ఇళ్లలో లేని సమయంలో కూడా కొన్ని ఛానళ్లు పెట్టి ఉంచాలని కోరి..అందుకు వారికి కొంత మొత్తం చెల్లిస్తూ వస్తున్నారు. ఏ ఇళ్ళలో ఎంత మంది ఏ ఛానల్ చూస్తున్నారనే అంచనాతోనే రేటింగ్స్ నిర్ధారిస్తారనే విషయం తెలిసిందే. ఇలా ఛానళ్ళు పెట్టి ఉంచినందుకు వారికి కొంత నగదు చెల్లించినట్లు పోలీసు కమిషనర్ వెల్లడించారు. ఈ టీఆర్పీ స్కామ్ కు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా..అతని దగ్గర 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 8.5 లక్షలు అతని బ్యాంక్ లాకర్ లో గుర్తించారు. మరాఠీ ఛానళ్ళు ఫక్త్ మరాఠి, బాక్స్ సినిమా ప్రతినిధులను అరెస్ట్ చేశారు. బార్క్ తరపున మీటర్లను పర్యవేక్షిస్తున్న హంసా కంపెనీ ఉద్యోగులు కూడా ఈ ఫ్రాడ్ లో భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారు.

బార్క్ నుంచి కూడా పోలీసులు ఆ ఇళ్ళ నుంచి వచ్చే డేటాను తీసుకున్నారు. ముంబయ్ లో జరుగుతున్న విధంగానే ఇతర ప్రాంతాల్లో కూడా జరిగే ఛాన్స్ ఉందని కమిషనర్ వెల్లడించారు. రిపబ్లిక్ టీవీ ప్రమోటర్లు, డైరక్టర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. వారిని విచారించటానికి పిలుస్తున్నట్లు తెలిపారు. విచారణ కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా రిపబ్లిక్ టీవీ అధికారులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. రేటింగ్స్ కోసం కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని తెలిపారు. ఈ రేటింగ్స్ స్కామ్ కు సంబంధించిన సమాచారాన్ని ముంబయ్ పోలీసులు ఇన్ఫర్ మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు కూడా పంపారు.

Next Story
Share it