రిలయన్స్ జియో..5జీ సేవలకు రెడీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. 2016లో టెలికం పరిశ్రమలోకి జియో ప్రవేశించినప్పటి నుంచి మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్ధానంలో ఉన్న భారత్ అగ్రస్ధానానికి ఎగబాకిందని తెలిపారు. జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకుందని చెప్పారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్వర్క్ లో చేరుతున్నారని చెప్పారు.
భారత్లో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి ఎగబాకిందని, ఇక అప్పటి నుంచి డేటా వినిమయం భారీగా పెరిగిందని వివరించారు. దేశంలో ప్రస్తుతం జియో రాక మునుపుతో పోలిస్తే నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినిమయం జరుగుతోందని చెప్పారు. రిలయన్స్ జియో కేవలం మూడేళ్లలోనే 4జీ నెట్వర్క్ ను నిర్మించగా, ఇతర టెలికాం కంపెనీలకు 2జీ నెట్వర్క్ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు.