చంద్రబాబు గొప్ప రాజధాని కట్టారంటున్న లోకేష్

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ చెబుతున్నట్ల అదే నిజం అయితే..ఇక వివాదం ఎక్కడ?. ఇక అసలు ఏపీకి కొత్త రాజధాని అవసరం కూడా లేదేమో లోకేష్ మాటల్లో. లోకేష్ ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘నువ్వేమైతే చెప్పావో వాటికంటే ఘనమైన లక్ష్యాలతో చంద్రబాబు నిర్మించిన అమరావతి ప్రజా రాజధానిని ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలి. మీరు కట్టాలనుకున్న రాజధాని కంటే గొప్పది చంద్రబాబు కట్టారని కూలగొడుతున్నారా?.
అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదని మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా? ఐదు కోట్ల ఆంధ్రులకు సమాధానం చెప్పి తీరాలి జగన్ గారూ! స్థానిక యువతకు ఉపాధి కల్పన, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్, గార్డెన్ సిటీ, లంగ్స్పేస్ తో ప్రపంచానికే తలమానికంగా నవ్యాంధ్రకు రాజధానిగా మహానగరం కడతానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు.’ అంటూ పేర్కొన్నారు.