Telugu Gateway
Latest News

విద్యార్ధులకూ ట్రంప్ షాక్

విద్యార్ధులకూ ట్రంప్ షాక్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ల మీద షాక్ ఇస్తున్నారు. ఇటీవలే హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలు విధించిన ఆయన ఇప్పుడు విద్యార్ధులకు కూడా షాక్ ఇచ్చారు. ఈ సంవత్సరం కొత్తగా విద్యార్ధులకు వీసాలు ఇవ్వబోమని తెలిపారు. అంతే కాదు ఇఫ్పటికే అమెరికాలో ఉండి చదువుకుంటూ కేవలం ఆన్ లైన్ క్లాస్ లకు మాత్రం వెళుతున్న వారికి ఇచ్చిన వీసాలు కూడా రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో ఉండాలంటే యూనివర్శిటీలు నిర్వహించే క్లాసులకు హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ‘‘వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోం. అలాంటి వారిని యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ దేశంలోకి అనుమతించదు. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా(ఎఫ్‌-1 ఎం-1-తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసేవి) మీద ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

లేదా చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే స్కూల్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్న విద్యా సంస్థకు బదిలీ చేయించుకోవాలి. అలా జరగని పక్షంలో ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’అని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న తాజా నిర్ణయం భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) గణాంకాల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరానికి గానూ అమెరికాలో దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు చైనా, భారత్‌, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా నుంచి వచ్చినవాళ్లే. ట్రంప్ నిర్ణయంపై డెమాక్రాట్లు మండిపడుతున్నారు.

Next Story
Share it