బిగ్ రిలీఫ్...కరోనాకు మందు వచ్చింది

గుడ్ న్యూస్. కరోనాకు ముందు వచ్చింది. ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ ఈ మందును భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనికి భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఏ) అనుమతి కూడా లభించింది. కరోనా చికిత్సలో ఇది అత్యంత కీలకం కాబోతుంది. కరోనా వైరస్ ను కట్టడి చేయటంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న యాంటి వైరల్ ఔషదం ఫవిపిరవిర్ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్స్ శనివారం ప్రకటించింది. ఫబిఫ్లూ పేరిట ఫవిపిరవిర్ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్టు తెలిపింది. కోవిడ్ బాధితుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వైరస్ తీవ్రత ఉన్నవారికి ఫబిప్లూతో చికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. దేశీయంగా కరోనా రోగులకు చికిత్స అందించే మందుల్లో ఫబిఫ్లూ తొలి ఔషదమని కంపెనీ పేర్కొంది. భారత్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో డీసీజీఐ అప్రూవల్ రావడం శుభపరిణామమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దాన్హా చెప్పారు.
కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, ఫబిఫ్లూతో ఉపశమనం లభించనుందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం, మెడికల్ కమ్యునిటీతో కలిసి బాధితులకు సేవలందిస్తామన్నారు. ఒక్కో టాబ్లెట్ ధర 103 రూపాయలుగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 1800 ఎంజీ మాత్రలు రోజు ఒకటి చొప్పున, 800 ఎంజీ మాత్రలు రోజూ రెండు చొప్పున 14 రోజుల వరకు వైద్యుల సలహా మేరకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. జపాన్లో ఇన్ఫ్లుయంజా వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం తొలుత ఈ ఔషధాన్ని కనుగొన్నారు. కొవిడ్-19 వెలుగుచూశాక చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో బాధితులకు ఫవిపిరవిర్ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. దీనివల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తేలింది.