ఇవాంక ట్రంప్ సహాయకురాలికి కరోనా పాజిటివ్

అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా ఇఫ్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికార భవనం శ్వేతసౌథం (వైట్ హౌస్)ను కూడా తాకింది. ఈ కారణంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఫలితం నెగిటివ్ గా నే వస్తోంది. అయితే వైట్ హౌస్ లో ఉన్న వ్యక్తులు ముగ్గురికి కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారుగా ఉన్న ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో శ్వేతసౌధంలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. బాధితురాలు గత కొన్ని వారాలుగా ఇవాంకాకు దూరంగానే ఉన్నారని.. కాబట్టి ఇవాంకాకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి.
ఇవాంకా, ఆమె భర్త జారేద్ కుష్నర్కు శుక్రవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగటివ్ ఫలితం వచ్చిందని వెల్లడించాయి. ఈ అంశంపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘కేటీ అద్భుతమైన వ్యక్తి. ఆమెలో కరోనా లక్షణాలు బయటపడలేదు. అయినప్పటికీ తరచూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆమెకు ప్రాణాంతక వైరస్ సోకినట్లు తేలింది’’ అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన శ్వేతసౌధ వర్గాలు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.