జియోలోకి మరో 6598 కోట్ల పెట్టుబడులు

రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ లో ఆ కంపెనీకి 1.34 శాతం వాటా దక్కనుంది. ఈ వాటా కోసం ఆ కంపెనీ పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా?. అక్షరాలా 6598.38 కోట్ల రూపాయలు. ఇప్పటికే జియోలో వరస పెట్టి వాటాలను ఫేస్ బుక్ తోపాటు పలు అగ్రశ్రేణి సంస్థలకు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఇఫ్పుడు జనరల్ అట్లాంటిక్ ఈ మొత్తం పెట్టుబడులు పెట్టింది. తాజాగా వచ్చిన పెట్టుబడులతో కలుపుకుంటే సంస్థ 67,194 కోట్ల రూపాయలు వచ్చినట్లు అయింది. గత నాలుగు వారాల్లో ఫేస్బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ వంటి టెక్ దిగ్గజాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.
భారత ఆర్థిక వ్యవస్థను తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు డిజిటల్ కనెక్టివిటీ కీలకమనే ముఖేష్ అంబానీ విజన్ను తాము పంచుకుంటున్నామని, భారత్లో డిజిటల్ విప్లవానికి ముందుండి చొరవ చూపిన జియోతో కలిసి పనిచేస్తామని జనరల్ అట్లాంటిక్ సీఈఓ బిల్ పోర్డ్ అన్నారు. ప్రపంచ టెక్ దిగ్గజాల పెట్టుబడులతో భారత్లో డిజిటల్ సొసైటీని పటిష్టపరిచేందుకు మార్గం సుగమం అవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది.