ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఇవే
కరోనా దెబ్బకు మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం..ఏప్రిల్ 20 నుంచి కీలక విభాగాలకు పరిమిత స్థాయిలో వెసులుబాట్లు కల్పించింది. ఏ రాష్ట్రం కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. పలు రంగాలకు ఈ నెల 20 నుంచి వెసులుబాట్లు కల్పించనున్నారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. థియేటర్లు, మాల్స్, జిమ్లు, స్విమ్మింగ్పూల్స్, బార్లు మూసివేయనున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంబంధిత అన్ని కార్యక్రమాలను కొనసాగించవచ్చని తెలిపింది. ఆన్లైన్ షాపింగ్ ద్వారా నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతిచ్చింది.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి కల్పించింది. కరోనా హాట్స్పాట్ల్లో మాత్రం ఈ మార్గదర్శకాలు వర్తించవని తెలిపింది. అక్కడ లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. హాట్స్పాట్లను ప్రకటించే అధికారం రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. హాట్స్పాట్ల్లో ఎటువంటి జనసంచారం ఉండకూడదని తెలిపింది. ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఫేస్ మాస్క్ లను ధరించడం తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది.
కొత్త మార్గదర్శకాలు..
మత ప్రార్ధనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి, ఐటి ఆధారిత సంస్థలు 50 శాతం సిబ్బందితో పనులు చేసుకోవచ్చు
కొరియర్ సర్వీసులకు అనుమతి
అన్ని విద్యా సంస్థలు, శిక్షణా, కోచింగ్ సంస్థలు మూసి ఉంచాల్సిందే.
కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం మ్యాన్పవర్కు అనుమతి
రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు వ్యక్తులను అనుమతి నిరాకరణ
అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
జాతీయ ఉపాధిహామీ పనులకు అనుమతి
ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణలకు అనుమతి
వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
అనాథ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి
భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు
నిర్మాణ రంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే అనుమతి