Telugu Gateway
Latest News

మూడు నెలలు బ్యాంకు రుణాలు కట్టాల్సిన పనిలేదు

మూడు నెలలు బ్యాంకు రుణాలు కట్టాల్సిన పనిలేదు
X

కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న అన్ని వర్గాలను ఆదుకునేందుకు కేంద్రం వరస పెట్టి కీలక నిర్ణయాలు ప్రకటిస్తోంది. అందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) కూడా శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల నుంచి రుణాల తీసుకున్న వారు మూడు నెలల పాటు రుణాల కిస్తీ (ఈఎంఐలు) కట్టాల్సిన అవసరం లేదు. హౌసింగ్ లోన్లతోపాటు అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఊరట కల్పించే అంశం. మామూలు రోజుల్లో అయితే బ్యాంకు రుణాలు వరసగా కట్టకుండా పోతే వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తారు. అదే సమయంలో ఆయా ఖాతాదారుల సిబిల్ స్కోరు దెబ్బతింటుంది. అయితే మూడు నెలల రుణాలు కట్టకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్ బిఐ వెసులుబాటు కల్పించింది. సహకార బ్యాంకులను కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. రుణాల వాయిదాతోపాటు ఆర్ బిఐ పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇప్పుడు వాయిదా వేసిన మూడు నెలల ఈఎంఐలను తర్వాత కాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఆర్ బిఐ కీలక మైన రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది.

ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని శక్తికాంత్ దాస్ మీడియా సమావేశంలో తెలిపారు. కరోనా వైరస్, లాక్ డౌన్ లాంటి అనివార్య పరిస్థితుల మధ్య మీడియాతో మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితంగా ఉందన్న ఆయన ప్రస్తుతం మనం ఓ అసాధారణ ముప్పు ఎదుర్కొంటున్నామని, కరోనా వైరస్‌పై విజయం సాధించాలంటే యుద్ధం తరహాలో పోరాడాలన్నారు. కఠినమైన పరిస్థితులు ఎప్పుడూ కొనసాగవని, ఆర్థిక సుస్థిరతకు ఊతమిచ్చే చర్యలు తీసుకునే సమయమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం మంచి చేసిందన్నారు. ఒకేసారి షేర్లు అమ్ముకోవడం వల్ల మార్కెట్లకు నష్టాలు వచ్చాయన్నారు.

Next Story
Share it