భారత్ లో 28 కరోనా కేసులు నమోదు

దేశంలో ఇప్పటివరకూ 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ముఖ్యంగా ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని మంత్రి సూచించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ తాజాగా భారత్ లో కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణలో వైరస్లను గుర్తించగా, ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన మరో 16 మందికి ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయులు కాగా16 మందిని ఇటలీకి చెందిన వారుగా పేర్కొన్నారు. దీంతో భారతదేశంలో ఇప్పటివరకు 28 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ బుధవారం అధికారికంగా ధృవీకరించారు. వీరులో ఒకరు ఢిల్లీకి చెందినవారు. ఆగ్రాలో ఆరుగురు, 16 మంది ఇటాలియన్లు, వారికి డ్రైవర్గా పనిచేసిన భారతీయుడు, తెలంగాణలో ఒకరు, ఇప్పటికే నిర్ధారించిన కేసులు అని తెలిపారు.
అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణీకులందరూ ఇప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవలసి ఉంటుందని తెలిపారు. వీరందరినీ ఎయిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త కేసులు గుర్తించడంతో భారతదేశంలో కరోనా వైరస్ భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇటలీ నుండి తిరిగి వచ్చి ఢిల్లీ నివాసి ఏర్పాటు చేసిన పార్టీకి కొంతమంది విద్యార్థులు హాజరైనందున రెండు నోయిడా పాఠశాలల్ని మూసివేశారు. ఈ అంశంలో ఎవరికీ వైరస్ సోకలేదని తేలింది. కరోనా వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ అమెరికా సహా ఇతర దేశాలలో వేగంగా వ్యాపిస్తోంది.