భారత్ లో మూడుకు చేరిన కరోనా కేసులు

టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ నూ భయపెడుతోంది. ఇఫ్పటికే దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే అన్నీ కేరళ రాష్ట్రంలోనే కావటం విశేషం. దీంతో కేంద్ర సర్కారు అప్రమత్తం అయింది.ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు ముమ్మరం చేసింది. చైనాలోని భారత విద్యార్థులను తిరిగి స్వదేశానికి ఇప్పటికే రప్పించారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ–వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది.
తాజాగా కరోనా వైరస్పై మంత్రుల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర హోంశాఖ సహాయకమంత్రి కిషన్రెడ్డితో పాటు స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి, పౌరవిమానయానశాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నారు. ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో 300 మందికి పైగా మృతి చెందారు. 15 వేల మందికి ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది.