Telugu Gateway
Latest News

రెండు వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా?.

రెండు వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా?.
X

నోట్ల రద్దు జరిగి ఈ శుక్రవారానికి మూడేళ్ళు అయింది. అందరూ ఆ పాత గాయాలను గుర్తు చేసుకుంటున్నారు. సామాన్యుల దగ్గర నుంచి మధ్య తరగతి ప్రజలు ఆ సమయంలో తీవ్ర ఇబ్బందుల పాలు అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ పెద్ద నోట్ల రద్దును ఉగ్రవాదుల దాడితో పోల్చారు. ఈ నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని...లక్షలాది మంది జీవితాలను సర్వనాశనం చేసిందని రాహుల్ విమర్శించారు. ఇలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడిన వారికి ఇంకా శిక్ష పడలేదంటూ కామెంట్ చేశారు ట్వీట్ లో. ఇదిలా ఉంటే ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్ సి గార్గ్ రెండు వేల రూపాయల నోట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనన మాట్లాడుతూ రెండు వేల రూపాయల నోటును కూడా రద్దు చేయాలని గార్గ్ అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా రెండు వేల రూపాయల నోట్లు పెద్దగా కన్పించకుండా పోయాయి. అంటే ఇవి అన్నీ మళ్లీ బ్లాక్ మనీదారుల చేతుల్లోకి వెళ్ళాయని..బడా బాబులు అందరూ తమ బ్లాక్ మనీని ఈ నోట్లలోనే దాచేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

నవంబర్ 8, 2016 న డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత ప్రవేశపెట్టిన కొత్త 2,000 నోట్లు ప్రధానంగా ఉన్నాయనీ ఇపుడు వీటిని అక్రమ టెండర్‌గా ప్రకటించవచ్చని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ .2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి అంతరాయం కలగదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోంద ని గార్గ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నప్పటికీ వీటిలో చాలా వరకు చెలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో 85 శాతానికి పైగా చెల్లింపు లావాదేవీలు ఇంకా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజల్ని డిజిటల్‌ చెల్లింపుల దిశగా మార్చే చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలన్నారు. అదే సమయంలో డిజిటల్‌ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ప్రజలు డిజిటల్‌ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో ఇలాంటి చర్యలే చేపట్టారని.. ప్రస్తుతం ఆ దేశంలో 87శాతం లావాదేవీలు డిజిటల్‌ రూపంలోనే జరుగుతున్నాయని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం బ్యాంకింగేతర డిజిటల్‌ చెల్లింపు సాధనాల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలన్నారు. మరి గార్గ్ డిమాండ్ చేస్తున్నట్లు కేంద్రం రెండు వేల రూపాయల నోట్ల రద్దుకు పూనుకుంటుందా?. బ్లాక్ మనీ పెట్టుకున్న పెద్దలకు షాక్ ఇస్తుందా?. అంటే వేచిచూడాల్సిందే.

Next Story
Share it