Telugu Gateway
Latest News

‘రియల్ ఎస్టేట్’ ప్రాజెక్టుల కోసం కేంద్రం ప్రత్యేక నిధి

‘రియల్ ఎస్టేట్’ ప్రాజెక్టుల కోసం కేంద్రం ప్రత్యేక నిధి
X

ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. మాంద్యం బారిన పడకుండా ఆర్ధిక వ్యవస్థను కాపాడటంతోపాటు దేశంలో ‘డిమాండ్’ ఫెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం 25 వేల కోట్ల రూపాయల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఎఐఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇందులో కేంద్రం 10వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్‌ చేస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిధులను సమకూర్చనుందని తెలిపారు. నిర్మాణంలో ఉండి నిలిచిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలుగా రూ.25,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం రూ.10,000 కోట్లు సమకూర్చుతుంది.

దీని ద్వారా అందుబాటు ధరలు, మధ్య ఆదాయ హౌసింగ్‌ ప్రాజెక్టులు పూర్తయేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. నగదు కొరత కారణంగా నిలిచిపోయిన, రెరాలో నమోదైన ప్రాజెక్టులను రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు పూర్తి చేసే అవకాశం లభించనుంది. ఈ నిధిని ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తారనీ, ఈ నిధి మూలంగా దాదాపు 3.5 లక్షల మంది మధ్య తరగతి గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆర్థికమంత్రి వివరించారు. ఎన్‌పీఏ కాకుండా, ఎన్‌సీఎల్‌టీకి వెళ్లిన హౌసింగ్‌ ప్రాజెక్టులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుందన్నారు. ఈ వివరాలను కేబినెట్ సమావేశం తరువాత నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు. 1,600 రియాల్టీ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో భారతదేశంలో సుమారు 4.58 లక్షల హౌసింగ్ యూనిట్లు చిక్కుకున్నాయని అంతర్గత సర్వేలో తేలిందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Next Story
Share it