Telugu Gateway
Latest News

భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం

భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం
X

రాబోయే రోజుల్లో భారత్-చైనా మరింత సన్నిహితంగా మెలగాలని నిర్ణయించాయి. విభేదాలు పెరగకుండా చూసుకోవటంతోపాటు ఇరు దేశాలు పలు అంశాలపై సున్నితంగా వ్యవహరించటం ద్వారా సృహద్భావ వాతావరణం నెలకొల్పులకోవాలని భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు నిర్ణయించుకున్నారు. ప్రపంచంలో శాంతి..సుస్ధిరతల కోసం ఇరు దేశాలు కలసి కట్టుగా ముందుకు సాగాలనే అభిప్రాయానికి వచ్చాయి. జిన్ పింగ్ తాజా పర్యటనతో భారత్-చైనాల మధ్య నూతన అధ్యాయం ప్రారంభం అయిందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. తొలుత మోడీ, జిన్ పింగ్, తర్వాత ప్రతినిధుల బృందం స్థాయిలో చర్చలు జరిగాయి. తాజా భారత పర్యటనను తానెప్పటికీ మరవలేనని జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. తనకు, తన సిబ్బందికి ఈ పర్యటన ఓ మధుర జ్ణాపకంగా మిగులుతుందని పేర్కొన్నారు. మోడీ చెప్పినట్లుగానే తమ మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నాంతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. మోడీ, జిన్ పింగ్ సమావేశం ముగిసిన వెంటనే భారత్ ఓ కీలక ప్రకటన చేసింది. మోదీ-జిన్‌పింగ్‌ అనధికార శిఖరాగ్ర భేటీలో కాశ్మీర్‌ అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే స్పష్టం చేశారు. కాశ్మీర్‌ భారత అంతర్గత విషయమన్న మన వైఖరికి అందరికీ సుస్పష్టంగా తెలిసిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార లాంఛనాలకు లేకుండా రెండురోజులపాటు జరిగిన మోదీ-జిన్‌పింగ్‌ సమావేశాలు ముగిసిన తర్వాత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శనివారం మీడియాతో మాట్లాడారు.

‘మొదట ఇద్దరు నేతలు 90 నిమిషాలపాటు చర్చించుకున్నారు. ఆ తర్వాత ప్రతినిధులస్థాయి చర్చలు జరిగాయి. అనంతరం మోదీ ఇచ్చిన మధ్యాహ్న విందును జిన్‌పింగ్‌ స్వీకరించారు. ఈ సదస్సులో భాగంగా మొత్తం ఆరు గంటల పాటు ఇరునేతలు ముఖాముఖి భేటీ అయ్యారు. భారత్‌, చైనా మధ్య పరస్పర సహకారం, పర్యాటకం, వాణిజ్యం తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, చైనా ఉపాధ్యక్షుడు హు చున్‌హువా దీనిపై చర్చించనున్నారు’ అని ఆయన తెలిపారు. అనధికార శిఖరాగ్ర చర్చలు ముగిసిన అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ట్విటర్‌లో చైనీస్‌ భాషలో కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌ వచ్చినందుకు జిన్‌పింగ్‌కు థాంక్స్‌ చెప్పిన మోదీ.. చెన్నై వారధిగా భారత-చైనా సంబంధాలు గొప్పగా ముందుకుసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీని తమ దేశం రావాల్సిందిగా జిన్ పింగ్ ఆహ్వానించగా..దీనికి మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆయన చైనాలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it