‘జియో ఫైబర్’ సంచలన ప్రకటన

ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇంట్లో కూర్చునే రిలీజ్ సినిమా చూడొచ్చు. అది ఎప్పటి నుంచి అంటే 2020 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు..నెలకు ఓ ఐదు వందల రూపాయలు వెచ్చిస్తే అమెరికా, కెనడాకు ఉచితంగా నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. ఇలాంటి ఎన్నో వినూత్న సౌకర్యాలు జియో ఫైబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ జియో ఫైబర్ సేవలు సెప్టెంబరు 5 నుంచి వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నాయనే విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. కంపెనీ వార్షిక సర్వసభ సమావేశంలో ఆయన జియో ఫైబర్ కు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. అంబానీ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... ‘సెప్టెంబరు 5 నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుంది. అదే రోజున జియో ఫైబర్ సేవలను కమర్షియల్ బేసిస్లో ప్రారంభిస్తాం. 1600 నగరాల్లోని 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్ను అందించాలనేది మా లక్ష్యం.’ అని తెలిపారు.
ఆ తర్వాత జియో ఫైబర్ ఫీచర్లను ఇషా, ఆకాశ్ అంబానీలు వెల్లడించారు. జియో సెట్ టాప్ బాక్సు ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్ సేవలు ఉచితంగా చేసుకోవచ్చని వెల్లడించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, 2020 జనవరి 1 నుంచి జియో కమర్షియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జియో గిగా ఫైబర్ ద్వారా సోషల్ గేమింగ్ పేరుతో మల్టిపుల్ గేమింగ్ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. మిక్స్ డ్ రియాలిటీ పేరుతో సరికొత్త వర్చువల్ రియాలిటీ సేవలు అందిస్తామని తెలిపారు.
జియో ఫైబర్ హైలెట్స్
* జియో ఫైబర్ ద్వారా 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు డేటా
* ప్రజలందరికీ అందుబాటు ధరల్లో జియో సేవలు. జియో ఫైబర్ సేవలు నెలకు రూ. 700 నుంచిరూ. 10వేల వరకు ఉంటాయి
* ప్రీమియం జియో ఫైబర్ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చు. ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’గా పిలిచే ఈ సేవలను 2020 మధ్యలో అందుబాటులోకి తీసుకొస్తాం
* జియో ఫైబర్ ద్వారా భారత్లోని ఏ టెలికాం ఆపరేటర్కైనా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఉచిత సేవలు జీవితకాలం ఉంటాయి
* ప్రారంభ ఆఫర్ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్ తీసుకునే జియో ఫైబర్ కస్టమర్లు హెచ్డీ/ 4కే ఎల్ఈడీ టీవీ, సెట్టాప్ బాక్సును ఉచితంగా తీసుకోవచ్చు
* జియో నుంచి నెలకు రూ. 500తో అమెరికా, కెనడాకు అపరిమిత కాలింగ్ ప్యాకేజీ