నోవాటెల్ లో ‘వర్మ ప్రెస్ మీట్ కు నో’
విజయవాడలోని ‘నోవాటెల్’ హోటల్ యాజమాన్యం రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ కు నో చెప్పిందా?. అంటే ఔననే చెబుతున్నారు వర్మ. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నోవాటెల్ లో విలేకరుల సమావేశం తలపెట్టారు. నోవాటెల్ హోటల్ వాళ్లకు ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో వారు ఈ ప్రోగ్రామ్ క్యానిల్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా మనందరికీ తెలిసి ఒక వ్యక్తి భయంతో హోటళ్లు, క్లబ్బులవారు జడిసి పారిపోయార’ని వర్మ పేర్కొన్నారు. మే1న ఏపీలో విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి విలేకరుల సమావేశం పెట్టాలని ఆయన తలపెట్టారు.
యాజమాన్యం నో చెప్పటంతో అది కాస్తా రద్దు అయింది. వర్మ ఊరుకుంటారా?. ఆయన తన ప్రెస్ మీట్ విజయవాడ పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద నిర్వహించనున్నట్టు ట్విటర్లో తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్టు చెప్పారు. ‘అదే విధంగా ‘మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతివారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానమ’ని పేర్కొన్నారు. ఇలా నడిరోడ్డు మీద విలేకరుల సమావేశం అంటే అనుమతిస్తారా?. అంటే వేచిచూడాల్సిందే.