అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ గ్రూపునకు మరో షాక్ తగిలింది. నాలుగు వారాల్లో 453 కోట్ల రూపాయలు అయినా కట్టండి..లేదంటే మూడు నెలల జైలు శిక్షకు అయినా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎరిక్సన్ ఇండియా వివాదంలో రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానికి ఈ పరిస్థితి ఎదురైంది. రూ. 550 కోట్ల బకాయిలను చెల్లించే ఉద్దేశం ఆర్కాంకు లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగువారాలలో ఎరిక్సన్ ఇండియాకు రూ. 453 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అదే సమయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఎరిక్సన్ వాదనను కోర్టు సమర్ధించింది. కేవలం క్షమాపణ చెబితే సరిపోదని ఆర్కాంకు సుప్రీం అక్షింతలు వేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించాలని వ్యాఖ్యానించింది.
ఇందుకు అనిల్ అంబానీతో పాటు ఇద్దరు డైరెక్టర్లను (రిలయన్స్ టెలికం ఛైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ అధ్యక్షురాలు ఛాయా విరాని) ఈ కేసులో దోషులుగా సుప్రీం తేల్చింది. ఒక్కొక్కరికీ కోటి రూపాయల జరిమానా కూడా విధించింది. నెల రోజుల్లోగా వీటిని డిపాజిట్ చేయవలసిందిగా ఆదేశించింది. లేదంటే నెలరోజుల పాటు జైలుకెళ్లాల్సి వుంటుందని తీర్పు చెప్పింది. అనిల్ అంబానీకి కొంత కొంతలో ఊరట ఏమిటంటే ఆయన్ను అరెస్ట్ చేయాలన్న ఎరిక్సన్ పిటీషన్ను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అడాగ్ గ్రూపు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎరికసన్ బకాయిలను చెల్లించడంలో ఆర్ కాం ఇప్పటికే రెండుసార్లు విఫలమైంది.