‘విలాస’ విమానం ఆగిపోనుంది

ఏ380. ఆకాశంలో ఓ అద్భుతం. విలాస విమాన ప్రయాణానికి ఓ చిరునామా. ఎందుకంటే విమానంలోనే ఓపెన్ బారు..సమావేశ మందిరాలు, డబ్బు ఉండాలే కానీ డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ సూట్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలతో వచ్చిందే ఈ ఏ380. ఇప్పటికే పలు అగ్రశ్రేణి ఎయిర్ లైన్స్ ఈ విమానాలను కొనుగోలు చేశాయి. అయితే ఈ విమానాలకు డిమాండ్ తగ్గిపోవటంతో వీటిని తయారు చేస్తున్న బోయింగ్ సంస్థ ఏ380 ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ విమానానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రయాణికుల విమానం కూడా ఇదే. కొత్తగా ఈ విమానాలు కొనే కస్టమర్లు లేకపోవడంతో 2021 నుంచి తయారీని నిలిపివేస్తున్నట్టు ఎయిర్బస్ వెల్లడించింది.
ఈ డబుల్ డెక్కర్ విమానాలకు ప్రధాన కస్టమర్ అయిన ఎమిరేట్స్ ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. ‘‘ఏ380 తయారీకి సంబంధించి పూర్తి చేయని ఆర్డర్లు పెద్దగా లేవు. కనుక తయారీని కొనసాగించాల్సిన అవసరం కనిపించడం లేదు’’ అని ఎయిర్బస్ ఓ ప్రకటనలో తెలిపింది. 500 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల డబుల్ డెక్కర్ ఎయిర్బస్ ఏ380ని మార్కెట్లోకి తీసుకొచ్చిన పదేళ్ల తర్వాత సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 2008లో తొలిసారి ఏ380 విమానం ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి వచ్చింది. భారత్ లో అతి తక్కువ విమానాశ్రయాల నుంచే ఈ సర్వీసులు ఉన్నాయి.