Telugu Gateway
Latest News

మోడీ నియోజకవర్గంలో ‘డబుల్ డెక్కర్ క్రూయిజ్’

మోడీ నియోజకవర్గంలో ‘డబుల్ డెక్కర్ క్రూయిజ్’
X

వారణాసి. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇప్పుడు కొత్తగా అక్కడే ‘అలకానంద’ పేరుతో డబుల్ డెక్కర్ క్రూయిజ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 15 నుంచి ఈ క్రూయిజ్ గంగా నదిలో సంచరించనుంది. ఒక్కో పర్యాటకుడు ఇందులో ప్రయాణించటానికి 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి ఈ క్రూయిజ్ ద్వారా వంద మంది ప్రయాణించవచ్చు. ఇందులో పర్యాటకుల సౌలభ్యం కోసం అరవై విలాసవంతమైన సోఫాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు..పర్యావరణహితమైన బయో టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు.

ఈ క్రూయిజ్ లో ఉండే కిచెన్ ద్వారా పర్యాటకులకు వెజ్ తో పాటు నాన్ వెజ్ వంటకాలను అందించనున్నారు. క్రూయిజ్ లోయర్ డెక్ లో పూర్తి ఎయిర్ కండిషన్ సౌకర్యంతో పాటు..చిన్న స్టేజీని కూడా ఏర్పాటు చేశారు. అందులో పర్యాటకులకు ఉచిత వైఫై సౌకర్యం కూడా కల్పిస్తారు. పైన ఉండే డెక్ లో రెస్టారెంట్ తోపాటు..పర్యాటకులు అక్కడి అందాలను వీక్షించే సౌకర్యం కల్పిస్తారు. ఇప్పటికే దేశంలో తొలి క్రూయిజ్ సర్వీసులు ముంబయ్ నుంచి గోవాకు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఇది అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఉంది. గోవా క్రూయిజ్ సర్వీసులతో పోలిస్తే వారణాసిలోని గంగా నదిలో ప్రయాణించే ఈ క్రూయిజ్ సర్వీసులు ఒకింత అందుబాటులో ఉన్నాయనే చెప్పుకోవచ్చు.

Next Story
Share it