Telugu Gateway
Andhra Pradesh

విజయ్ మాల్యా నుంచి చంద్రబాబుకు 150 కోట్ల విరాళం

విజయ్ మాల్యా నుంచి చంద్రబాబుకు 150 కోట్ల విరాళం
X

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రాబాబునాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు. భారత్ లో బ్యాంకులకు 9000 కోట్ల ఎగ్గొట్టి పరారు అయిన విజయ్ మాల్యా నుంచి టీడీపీ అధినేత 150 కోట్ల రూపాయలు విరాళంగా తీసుకున్నారని అన్నారు. 2016, మార్చి 12,13,14 తేదీల్లో చంద్రబాబు నాయుడు లండన్‌కు వెళ్లి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను కలిశారా? లేదా?.. మాల్యా దేశం వదిలి పారి పోయిన 10 రోజులకు చంద్రబాబు ఆయన్ను కలవలేదా?. గత ఎన్నికల కోసం మాల్యా నుంచి రూ.150 కోట్ల విరాళం తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. మాల్యా నుంచి తీసుకున్న విరాళాలపై చంద్రబాబు జవాబు చెప్పాలని, లేనిపక్షంలో అవన్నీ వాస్తవాలు అనుకోవాల్సి వస్తుందన్నారు.

చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్‌కు సోమవారం ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు. యూటర్న్‌ అంకుల్‌ చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వస్తున్నారన్నారు. గతంలో అన్ని పార్టీలతో జతకట్టి.. తర్వాత అందరినీ వదిలిపెట్టిన చంద్రబాబు మళ్లీ పార్టనర్‌ కోసం ఢిల్లీకి వస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు దుర్మార్గ పాలనను ప్రజలు మర్చిపోరని తెలిపారు. ఓటుకు నోట్లు కేసుతో పాటు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌, రాజధాని నిర్మాణం, పోలవరం పనుల్లో చంద్రబాబు లక్ష కోట్లకు పైగా స్కామ్‌లు చేశారని ఆరోపించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరిగిన స్కాం లపై అన్నీపార్టీల నేతలు కేంద్ర నాయకత్వాలకు తెలపాలన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఆరోపణలను టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. 16 నెలలు జైలులో ఉండి వచ్చిన వారు తమపై ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it