విజయవాడలో మహేష్ బాబు హల్ చల్

‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు శుక్రవారం నాడు విజయవాడలో హల్ చల్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించటం..దీనికి మంచి ఆదరణ లభించటంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. అందులో భాగంగానే ఏపీలోని పలు ప్రాంతాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న మహేష్ బాబు తొలుత కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత నగరంలోని అన్నపూర్ణ థియేటర్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రేక్షకులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. మహేశ్తో పాటు చిత్ర దర్శకుడు కొరటాల శివ, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. సినిమా చూసిన తర్వాత మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయవాడలో సినిమా చూడటం సంతోషంగా ఉంది. ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాల విజయోత్సవ వేడుకలను ఇక్కడే నిర్వహించాం. వందేళ్లు వచ్చే వరకు సినిమాలు మాత్రమే చేస్తా. ఇప్పటివరకు నాన్నగారి ఇమేజ్ నాపై పడలేదు. ఈ సినిమాలో నన్ను నాన్నలా చూపించినందుకు కొరటాలకు కృతజ్ఞతలు తెలిపారు.