Telugu Gateway
Andhra Pradesh

సీఎం అక్రమ నివాసంలో మరో ‘అక్రమ కట్టడం’

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో నివాసం ఉంటున్నదే అక్రమ కట్టడం. నదీ ప్రవాహన్ని అడ్డుకునేలా నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ వ్యవహారంపై తొలుత పెద్ద దుమారమే రేగింది. సీఎం చంద్రబాబు అందులో చేరిన తర్వాత అక్రమం కాస్తా సక్రమం అయిపోయింది. అసలు సీఎం ఉంటున్నదే అక్రమ నివాసం అయితే..అందులో మరో అక్రమ కట్టడం పూర్తికావొచ్చిది. కరకట్టపై నుంచి వెళుతుంటే చంద్రబాబు నివాసం ముందు కొత్తగా చేపట్టిన ఓ భారీ నిర్మాణం కనపడుతుంది. దీన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఐదున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టింది. అసలు నిబంధనల ప్రకారం కరకట్ట ముందు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టడం అధికార వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్మాణాన్ని ప్రజలను చంద్రబాబు కలుసుకునేందుకు...ఇతర అవసరాలకు ఉపయోగించాలని ప్రతిపాదించారు.

ఏపీ మంత్రి నారాయణ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ సీఎం నివాసం కరకట్టకు వంద మీటర్ల లోపే ఉంటే దాన్ని తొలగిస్తామని ప్రకటించారు. వంద మీటర్ల లోపు ఉంటే ఇప్పుడు కొత్తగా కట్టిన ఐదున్నర కోట్ల నిర్మాణం కూడా కొట్టేయాల్సి వస్తుందన్న మాట. సాగునీటి శాఖ నిపుణుల ప్రకారం ఇది ఖచ్చితంగా వంద మీటర్ల లోపే ఉంటుందని చెబుతున్నారు. మరి ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే. లింగమనేని ఎస్టేట్స్ కు చెందిన గెస్ట్ హౌస్ సీఎం అధికారిక నివాసంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ లింగమనేని గెస్ట్ హౌస్ తోపాటు చుట్టుపక్కల ఉన్న పలు గెస్ట్ హౌస్ లు అన్నీ అక్రమ నివాసాలే అని సాగునీటి శాఖ ప్రకటించింది. సాక్ష్య్యాత్తూ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఇవన్నీ అక్రమ నిర్మాణాలే అని బహిరంగగా ప్రకటించారు. తర్వాత ఆయన మాట మార్చారు.

Next Story
Share it