Telugu Gateway
Top Stories

శ‌శిథ‌రూర్ తో మ‌హిళా ఎంపీల సెల్ఫీ..కొత్త వివాదం

శ‌శిథ‌రూర్ తో మ‌హిళా ఎంపీల సెల్ఫీ..కొత్త వివాదం
X

కాంగ్రెస్ ఎంపీ శశిథ‌రూర్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. సోమ‌వారం నాడు ప్రారంభం అయిన పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఆయ‌న మ‌హిళా ఎంపీల‌తో సెల్పీ దిగారు. ఆ సెల్ఫీ చూస్తే మ‌హిళా ఎంపీలే తీసిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. అయితే ఈ ఫోటోను ఆయ‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేస్తూ చేసిన కామెంట్ మాత్రం దుమారం రేపింది. 'ప‌నిచేయ‌టానికి లోక్ స‌భ ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌దేశం కాద‌ని ఎవ‌రు చెప్పారు. స‌హ‌చ‌ర ఎంపీల‌తో ఉద‌యం పార్ల‌మెంట్ లో' అంటూ ట్వీట్ చేశారు. ఇందులో సుప్రీయ‌సూలే, ప్రణీత్ కౌర్, టి. తంగ‌పాండ్య‌న్, మిమి చ‌క్ర‌వ‌ర్తి, నుస్ర‌త్ జ‌హాన్ తదిత‌రులు ఉన్నారు. ఎంతో స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ఈ ఫోటో దిగామ‌ని..మ‌హిళ ఎంపీలే ఈ ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌మ‌ని కూడా కోరార‌న్నారు. అయితే ఫోటోతోపాటు శశిధ‌రూర్ చేసిన కామెంట్ వివాదానికి కార‌ణం అయింది. ''బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు.. మీ తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్‌ కామెంట్‌ చేయడం ఏంటి?. విమ‌ర్శ‌లు గుప్పించారు.

మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా.. ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా.. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరీ ఇదేంటి ' అంటూ శశి థరూర్‌ని ఆడుకున్నారు సోష‌ల్ మీడియాలో. దీంతో ఆయ‌న త‌న త‌ప్పు తెలుసుకుని ట్విటర్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు. సారీ చెప్తూ మరో ట్వీట్‌ చేశారు శశి థరూర్‌. ''ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్‌ చేయమని కోరారు.. నేను చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది'' అంటూ మరో ట్వీట్‌ చేశారు.

Next Story
Share it