Telugu Gateway
Top Stories

హైదరాబాద్ వరద బాదితుల సాయం కోసం 550 కోట్లు

హైదరాబాద్ వరద బాదితుల సాయం  కోసం 550 కోట్లు
X

బాధిత కుటుంబానికి పది వేలు సాయం

ఇళ్ళు కూలిపోతే లక్ష..పాక్షికంగా దెబ్బతింటే 50 వేల సాయం

భారీ వర్షాలు..వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాద్ లో ప్రజలను ఆదుకునేందుకు 550 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. ఒక్కో బాధిత కుటుంబానికి పది వేల రూపాయల మేర ఆర్ధిక సాయం అందించనున్నారు. ఇళ్ళలోకి నీళ్ళు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని సీఎం కెసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పది వేల రూపాయల ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని సిఎం వెల్లడించారు. వానలు వరదల వల్ల ఇళ్ళు పూర్తిగా కూలిపోయని వారికి లక్ష రూపాయల చొప్పున పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు ఏభై వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్టు సిఎం కేసీఆర్ ప్రకటించారు. దెబ్బతిన్న రహదారులు ఇతర మౌలిక వసతుల పునరుద్దరణకు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి తిరిగి మామూలు జీవన పరిస్థితలు నెలకొనేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు.

పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ.550 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నదని సిఎం కెసిఆర్ చెప్పారు. '' గడిచిన వందేల్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు బస్తీలలో వుండేవారు లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువగా కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాధమిక విధి, కష్టాల్లో వున్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించాం..'' అని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నగర పరిధితోపాటు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సిఎం ఆదేశించారు.

నగరంలో 200- 250 బృందాలను ఏర్పాటు చేసి అన్ని చోట్లా ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం అతిముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరరాబాద్ నగరానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని సిఎం కెసీఆర్ చెప్పారు. నష్టపోయిన ప్రజలకు ఎంతమంది ఉన్నాసరే..లక్షల మందికైనా సరే.. సాయం అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని బాధితులకు అండగా ఉండాలని సిఎం పిలుపునిచ్చారు.

Next Story
Share it