Telugu Gateway
Top Stories

అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ బోర్డింగ్ పాస్ లు

అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ బోర్డింగ్ పాస్ లు
X

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత

దేశంలోనే ఈ తరహా సేవలు అందిస్తున్నది తొలి విమానాశ్రయం హైదరాబాద్ లోని జీఎంఆర్ కు చెందిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమే. ఈ సేవలు వల్ల ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలో వేచిచూడాల్సిన అవసరం ఉండదు. కరోనా వంటి సమస్యలు ఉన్న ఈ తరుణంలో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు. శంషాబాద్ లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని అందించిన మొదటి ఎయిర్ లైన్స్‌ గా 'ఇండిగో' గుర్తింపు పొందింది. సొంతంగా తయారు చేసిన ఈ డిజిటల్ సొల్యూషన్‌ను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చి, తద్వారా భారతదేశంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి విమానాశ్రయంగా శంషాబాద్ నిలిచింది. ప్రస్తుతం ఈ సేవలు ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంపిక చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

పైలట్ ప్రయోగాలు విజయవంతమై, ప్రభుత్వ ఆమోదం పొందిన అనంతరం ఈ ఈ-బోర్డింగ్ సేవలను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్ 2న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కు చెందిన షార్జా విమానం 6E 1405 విమానం ప్రయాణికులు హైదరాబాద్ నుండి ఈ-బోర్డింగ్‌ సేవలను అందుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే మిగతా అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులలోనూ ఈ-బోర్డింగ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ఫణికర్ వెల్లడించారు. దేశీయ విమాన సర్వీసుల్లో 5 సంవత్సరాల పాటు ఈ-బోర్డింగ్ విజయవంతమైన తరువాత, అంతర్జాతీయ విమాన సేవలలో ఈ-బోర్డింగ్ ప్రారంభిస్తున్నామన్నారు. భారతీయ విమానాశ్రయాలలో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయం మనదే.

ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రయాణికుల ప్రయాణ కార్యకలాపాలను ఆటోమేట్ చేయడం వల్ల వారు మరింత సురక్షితంగా, మరింత ధైర్యంతో ప్రయాణాలు చేయగలుగుతారు. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమై, అన్ని రకాల ఆమోద ప్రక్రియలూ ముగిసిన అనంతరం అంతర్జాతీయ ప్రయాణికులకు దీనిని అందుబాటులోకి తీసుకు వస్తున్నాము." అన్నారు. ఈ సౌకర్యం వల్ల ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉండే సమయం తగ్గుతుందని, ఒక అడ్వాన్స్‌ డ్ సెక్యూరిటీ వ్యవస్థగా ఈ-బోర్డింగ్ వల్ల వివిధ సెక్యూరిటీ పాయింట్ల వద్ద మళ్లీ మళ్లీ తనిఖీ చేయాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. ఎయిర్ లైన్స్ సంస్థల కార్యకలాపాలు స్ట్రీమ్‌లైన్ చేయబడి, వారు తమ వనరులను సమర్థంగా ఉపయోగించుకోగలుగుతారు. వివిధ చెక్ పాయింట్ల వద్ద ప్రయాణికుల రియల్ టైమ్ డేటా లభించి, తద్వారా ఆపరేషన్ సామర్థ్యాలు పెరుగుతాయి. విమానాశ్రయం మొత్తం నిర్వహణా సామర్థ్యాలు, భద్రత పెరుగుతాయని వెల్లడించారు.

ఎలా ఉపయోగించుకోవాలి?

ఈ బోర్డింగ్ సేవలను ఉపయోగించుకునే ప్రయాణికులు ఈ క్రింది వాటిని అనుసరించాలి:

బుకింగ్

1) ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోండి

2) వెబ్ చెక్ ఇన్ చేయండి

విమానాశ్రయం

1) డిపార్చర్ ప్రవేశ ద్వారం: డిజిటల్/ప్రింటెడ్ బోర్డింగ్ కార్డును ఇ-బోర్డింగ్ స్కానర్‌పై చూపించండి; సీఐఎస్ఎఫ్ పత్రాలను ధృవీకరిస్తుంది. ప్రయాణీకులను లోపలికి అనుమతిస్తుంది

2) చెక్ ఇన్ కౌంటర్: చెక్ ఇన్ ఏజెంట్లు బోర్డింగ్ కార్డ్/లను స్కాన్ చేస్తారు; ప్రయాణీకులు లగేజ్ కౌంటర్ వద్ద తమ లగేజ్ డ్రాప్ చేస్తారు.

3) ఇమ్మిగ్రేషన్: బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణీకుల పాస్ పోర్ట్ ధృవీకరణను పూర్తి చేస్తారు.

4) సెక్యూరిటీ స్క్రీనింగ్ జోన్: సెక్యూరిటీ చెక్ కోసం ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ (ATRS) కదలికలపై చేతి సామాను ఉంచుతుంది. ఇ-బోర్డింగ్ స్కానర్‌లో బోర్డింగ్ కార్డును స్కాన్ చేసి ముందుకు సాగుతారు

5) బోర్డింగ్ గేట్: బోర్డింగ్ ప్రకటన వద్ద, ఇ-బోర్డింగ్ స్కానర్‌లో బోర్డింగ్ కార్డును స్కాన్ చేసి, విమానం ఎక్కడానికి గేట్ల వైపు కదులుతారు

అంతర్జాతీయ ప్రయాణీకులంతా ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టెర్మినల్ (IIDT) నుండి ప్రయాణం చేస్తున్నారు. COVID-19 ముప్పు నుండి రక్షించడానికి టెర్మినల్ ఎంట్రీకి ముందు థర్మల్ స్క్రీనింగ్, అన్ని ప్రయాణీకుల ప్రాసెసింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యూ ఏర్పాట్లు, తప్పనిసరి సామాజిక దూరం వంటి ప్రత్యేక స్క్రీనింగ్ మరియు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

Next Story
Share it