Telugu Gateway
Top Stories

అరవై రెండు వేల మెజారిటీ నుంచి అగాథంలోకి టీఆర్ఎస్

అరవై రెండు వేల మెజారిటీ నుంచి అగాథంలోకి టీఆర్ఎస్
X

వావ్...వాటే విక్టరీ..దుబ్బాక ఇక బిజెపి ఇలాక

ఉత్కంఠ అంటే ఏంటో దుబ్బాక ఫలితం చూపించింది. నువ్వా..నేనా అంటూ సాగిన దుబ్బాక ఉప ఎన్నిక పోరులో బిజెపి అనూహ్య విజయం సాధించింది. తెలంగాణలో మెజారిటీ ప్రజలు అసలు దుబ్బాకలో బిజెపి గెలుపును ఖచ్చితంగా ఏ మాత్రం ఊహించలేదని చెప్పొచ్చు. టీఆర్ఎస్ గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలుస్తుంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించారు. బిజెపి గెలుపు కంటే మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది అధికార టీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో ఓటమి పాలైన తీరు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 62 వేల మెజారిటీతో విజయం దక్కించుకుంది. రెండు అంటే రెండేళ్లలో టీఆర్ఎస్ ఎంతో పట్టున్న దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీ 62 వేల ఓట్లు తుడిచిపెట్టుకు పోవటంతో పాటు మరికొంత నష్టాన్ని చవిచూశారు. బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు దుబ్బాకలో 1470 ఓట్లతో విజయం సాధించారు. కొద్ది రోజుల క్రితం మంత్రి కెటీఆర్ మాట్లాడుతూ అసలు బిజెపి, కాంగ్రెస్ లకు దుబ్బాకలో డిపాజిట్లు కూడా రావన్నారు.

జిల్లా మంత్రి హరీష్ రావు చూసుకుంటున్నారనే సీఎం కెసీఆర్, తాను అక్కడకు పోవాల్సిన అవసరం లేదని..ఖచ్చితంగా గెలుస్తామని కెటీఆర్ ప్రకటించారు. మంగళవారం నాడు కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి బిజెపి లీడ్ లో కొనసాగింది. మధ్యలో అనూహ్యంగా టీఆర్ఎస్ పలు రౌండ్లలో మెజారిటీ సాధించటంతో ఫలితం ఉత్కంఠ గా మారింది. చివరకు మాత్రం బిజెపినే గెలుపు వరించింది. దీంతో హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో బిజెపి ఉత్సవాల్లో మునిగిపోయింది. ఏది ఏమైనా తెలంగాణలో పాగా వేయాలని కోరుకుంటున్న బిజెపికి ఈ పలితం టానిక్ లా పనిచేస్తుంది.

Next Story
Share it