ఫ్రీ బిర్యానీ కోసం డీసీపీ డిమాండ్
విచారణకు ఆదేశించిన హోం మంత్రి
'హోటల్ నుంచి బిర్యానీ ఉచితంగా తీసుకురండి. మన పరిధిలో ఉన్న రెస్టారెంట్లకు మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి. ఫ్రీగానే తేవాలి.' . ఇది ఓ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) తన కింది అధికారులకు జారీ చేసిన ఆదేశాలు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే ఈ వ్యవహరంపై విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీ చేసింది పూణేలోని జోన్ 1 లోని డీసీపీ ప్రియాంక నర్వారే అని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఆమె మాత్రం ఇది మార్ఫింగ్ చేశారు అని ఆరోపించారు. పూణే పర్యటన సందర్భంగా హోం మంత్రి పాటిల్ ఈ విషయంపై స్పందిస్తూ ఇది చాలా తీవ్రమైన విషయం అని..పోలీస్ కమిషనర్ ను ఈ అంశంపై విచారణ జరిపించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.
ఆ ఆడియో క్లిప్ లో డీసీపీ తమ ఏరియాలో మంచి రెస్టారెంట్లు ఏమి ఉన్నాయని ఆరా తీశారు తొలుత.తర్వాత సదాశివపేట ఏరియాలో మంచి భోజనం, నెయ్యి, కొల్లాపూరి మటన్ తో చేసిన బిర్యానీ ఉంటుందని చెప్పిన మాటలు విన్పిస్తాయి. అంతే కాదు మన పరిధిలో ఉన్న హోటల్ కు మనం డబ్బులు ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించారు ఆమె. అయితే కింది స్థాయి అధికారి మాత్రం తాము ఎప్పుడైనా డబ్బులు చెల్లించి ఆహారం తెచ్చుకుంటామని చెప్పగా..కానీ డీసీపీ మాత్రం ఉచితంగా తేవాలని ఆదేశించారు. ఈ ఆడియో వైరల్ కావటంతో నెటిజన్లు డీసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చివరకు బిర్యానీ కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుంటారా అని మండిపడుతున్నారు.