Telugu Gateway
Top Stories

పిల్లలకూ వ్యాక్సిన్..కీలక ముందడుగు

పిల్లలకూ వ్యాక్సిన్..కీలక ముందడుగు
X

కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక పరిణామం. భారత్ లోనూ పిల్లలకు కూడా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ దిశగా కీలక అడుగు పడింది. అమెరికాలో ఇప్పటికే చిన్నారులకు వ్యాక్సిన్ వేసేందుకు ఫైజర్‌కు అనుమతులు లభించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై కోవాక్సిన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ గురువారం అనుమతి ఇచ్చింది. 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. 2 నుంచి 18ఏళ్ల వారిపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్‌ బయోటెక్‌ ఈ ఏడాది ప్రారంభంలో దరఖాస్తు చేసుకుంది. అనుమతుల విషయంలో కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది.

అన్ని ప్రోటోకాల్స్ పరిశీలించిన తర్వాత 2-18 ఏళ్ల వయసు చిన్నారులపై టీకా క్లినికల్‌ ప్రయోగాలు జరిపేందుకు ఈ కమిటీ సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రయల్స్ సమయంలో టీకా 28 రోజుల వ్యవధిలో కండరాల ద్వారా రెండు డోసులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ట్రయల్స్‌ ఢిల్లీ, పాట్నా, ఎయిమ్స్‌, నాగ్‌పూర్‌ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరగనున్నాయి. ఇక మూడో దశ ప్రయోగాలు జరపడానికి ముందే రెండో దశ క్లినికల్‌ పరీక్షల భద్రతా డేటా, డీఎస్‌ఎంబీ సిఫార్సులను సీడీఎస్‌సీవోకు సమర్పించాలని భారత్‌ బయోటెక్‌కు కమిటీ షరతు విధించింది.

Next Story
Share it