చైనాలో మళ్ళీ కరోనా కలకలం..వందల విమానాలు రద్దు
ప్రపంచం అంతా ఇప్పుడే కరోనా నుంచి కోలుకుని గాడిన పడుతున్న తరుణంలో మళ్ళీ కలకలం. తొలిసారి కరోనా వైరస్ వెలుగుచూసిన చైనాలోనే ఇప్పుడు మళ్ళీ వైరస్ అలజడి రేపటం సంచలనంగా మారింది. గత ఐదు రోజులుగా వైరస్ కేసులు భారీ ఎత్తున వెలుగుచూడటంతో ఆ దేశం వెంటనే చర్యలు ప్రారంభించింది. వందల సంఖ్యలో విమానాలు రద్దు చేయటంతోపాటు స్కూళ్లు కూడా మూసివేసింది. అంతే కాకుండా భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తోంది. వైరస్ వ్యాప్తి జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా ఉత్తర, వాయువ్య చైనా ప్రాంతంలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాలో మళ్లీ ఆంక్షలు విధించటం ప్రారంభించారు.
బీజింగ్ సరిహద్దులను మూసివేయటంతోపాటు...లాక్ డౌన్లు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. తాజాగా కేసులు వెలుగుచూడటం వెనక ఓ పర్యాటక గ్రూప్ ఉందని..ఆ గ్రూప్ లోని పెద్ద వయస్సు వ్యక్తుల ద్వారా కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయని భావిస్తున్నారు. ఈ గ్రూప్ షాంగైతోపాటు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఆయాప్రాంతాల్లోని స్థానిక అధికారులు అన్ని పర్యాటక ప్రాంతాలతోపాటు ఇతర కేంద్రాలను కూడా మూసివేశారు. 2022లో బీజింగ్ లో ఒలింపిక్స్ కు సిద్ధమవుతున్న ఈ తరుణంలో కొత్తగా వైరస్ వెలుగుచూడటం ఆందోళన చెందుతున్నారు. ఈ ఒలింపిక్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి.