Telugu Gateway
Telugugateway Exclusives

వైసీపీ స‌భ్య‌త్వం లేక‌పోయినా రాజ్య‌స‌భ సీట్లు

వైసీపీ స‌భ్య‌త్వం లేక‌పోయినా రాజ్య‌స‌భ సీట్లు
X

ప్రాంతీయ పార్టీల్లో నిర్ణ‌యాలు అలాగే ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. అయితే క‌నీసం పార్టీ స‌భ్య‌త్వం లేక‌పోయినా అత్యంత కీల‌క‌మైన రాజ్య‌స‌భ సీట్లు కేటాయించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా పార్టీతో ఏ మాత్రం సంబంధం లేకుండా రాజ్య‌స‌భ సీట్లు ద‌క్కించుకున్న వారి సంఖ్య అధికార వైసీపీలో ఇప్పుడు మూడుకు చేరింది. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ముఖేష్ అంబానీ సిఫార‌సు మేర‌కు ఆయ‌న స‌న్నిహితుడు..పారిశ్రామిక‌వేత్త అయిన ప‌రిమ‌ళ్ న‌త్వానీకి 2020లో సీఎం జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చారు. అప్ప‌ట్లో సొంత పార్టీ నుంచే విమ‌ర్శ‌లు రాగా..వైసీపీ సోష‌ల్ మీడియా మాత్రం ఆయ‌న‌తో రాష్ట్రానికి పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌స్తాయ‌ని..సీఎం జ‌గ‌న్ వ్యూహ‌త్మ‌కంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని క‌వ‌ర్ చేసుకున్నారు. కానీ అక్క‌డ సీన్ క‌ట్ చేస్తే ఆయ‌న ఏపీ గురించి రాజ్య‌స‌భ‌లో మాట్లాడింది కానీ..సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర జ‌రిగే పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశాల‌కు హాజ‌రైంది కానీ ఏమీలేద‌నే చెప్పొచ్చు. అంతే కాదు..ఆయ‌న వ‌ల్ల రాష్ట్రానికి వ‌చ్చిన పెట్టుబ‌డులు కూడా ఏమీలేవ‌నే చెప్పొ్చ్చు. ప‌రిమ‌ళ్ న‌త్వానీకి రాజ్య‌స‌భ సీటు అయితే ఇచ్చారు కానీ ఆయ‌న ఏపీ వైపు ఏడాదికోసారి కూడా క‌న్నెత్తి చూడ‌రు. మ‌రి అలాంటి వారికి అత్యంత కీల‌కమైన సీటు ఇవ్వ‌టం అంటే దాని లెక్క‌లు దానివే. ఇప్పుడు మ‌రోసారి అలాంటి సీనే రిపీట్ అయింది.

వైసీపీకి ద‌క్కే నాలుగు రాజ్య‌స‌భ స్థానాల‌కు మంగ‌ళ‌వారం సీఎం జ‌గ‌న్ అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేశారు. ఇందులో అడ్వ‌కేట్ నిరంజ‌న్ రెడ్డి, బీసీ నేత క్రిష్ణ‌య్య‌ల‌కు వైసీపీ స‌భ్య‌త్వం కానీ...ఆ పార్టీతో నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు. నిరంజ‌న్ రెడ్డి జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త లాయ‌ర్...ఏపీ ప్ర‌భుత్వ కేసులు వాదించినందుకు ఆయ‌న‌కు భారీ ఎత్తున పీజులు ముట్ట‌చెబుతూ జీవోలు ఇచ్చార‌ని గ‌తంలో ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంటే జ‌గ‌న్ త‌న వ్య‌క్తిగ‌త లాయ‌ర్ కు రాజ్య‌స‌భ సీటు ఖ‌రారు చేశారు అనుకుందాం. ఆర్. క్రిష్ణ‌య్య‌ది వైసీపీ వ‌ర్గాల‌తోపాటు అంద‌రికీ పెద్ద స‌స్పెన్సే అని చెప్పొచ్చు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ ప‌దిహేను సంవ‌త్స‌రాల క్రితం అంటే ఆర్. క్రిష్ణ‌య్య‌కు బీసీ నేత‌గా ఓ ఇమేజ్ ఉండేది. ఆ త‌ర్వాత ఆయ‌న ఓసారి టీడీపీలో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత కాంగ్రెస్ లో పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా ఏపీలో వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ద‌క్కింది. అయితే నిరంజ‌న్ రెడ్డి విష‌యంలో జ‌గ‌న్ లెక్క‌లు ఆయ‌న‌కు ఉండొచ్చు. కానీ క్రిష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌టం వ‌ల్ల రాజ‌కీయంగా వైసీపీకి, జ‌గ‌న్ కు ఎంత మేలు చేస్తుంది అన్న‌ది వేచిచూడాల్సిందే. గ‌తంలో టీడీపీ కూడా రాష్ట్రేత‌రుల‌కు రాజ్య‌స‌భ స్థానాలు ఇచ్చినా ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉండ‌టంతో బిజెపి సిఫార‌సు చేసిన వాళ్ల‌కు సీట్లు కేటాయించారు. తాజా జాబితాలో రాజ్య‌స‌భ సీటు ద‌క్కించుకున్న బీద మ‌స్తాన్ రావు కూడా 2019 డిసెంబ‌ర్ లోనే టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరారు.



Next Story
Share it