Telugu Gateway
Telangana

డబ్బులు పోలీసులు పెట్టారని దుష్ప్రచారం

డబ్బులు పోలీసులు పెట్టారని దుష్ప్రచారం
X

దుబ్బాకలో సోమవారం జరిగిన పరిణామాలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. బిజెపి ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతోంది. అధికార టీఆర్ఎస్ బిజెపిపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో సోమవారం నాటి ఘటనపై సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మీడియాకు సమాచారం అందజేశారు. పోలీసులు ఆ ఇంట్లో డబ్బులు తీసుకువచ్చి పెట్టారని ప్రచారం చేస్తున్నారని..ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వీడియో రికార్డ్ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారం అన్నారు. 'నిన్నటి సోదాల ఘటనలో ఎగ్జిక్యూటివ్ అధికారి వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే సెర్చ్ వారెంట్ ఇచ్చారు. అక్కడ జరిగిన ప్రతి విషయం సాక్షుల సంతకాలు తీసుకునే చేశారు. అంతా సురభి జితేందర్ రావు సమక్షంలోనే అంతా జరిగింది. ఎగ్జిక్యూటివ్ అధికారి పంచనామా పూర్తి చేసి బయటకు వచ్చేముందు బీజేపీ కార్యకర్తలు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలి. నిన్న నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేస్తే ఒక్కరి వద్దనే డబ్బులు దొరికాయి.

నిన్నటి ఘటనలో 5 గురిని గుర్తించాం, మరో ఇరవై మందిపై కేసులు నమోదు చేశాం. అధికారులు సీజ్ చేసిన నగదును ఎత్తుకెళ్లాడం పెద్ద నేరం. బండి సంజయ్ కి సిద్దిపేట జరిగిన ప్రతి విషయం చెప్పి సిద్దిపేట కు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని చెప్పాం. ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చే వారిని ఎవరిని కూడా అడ్డుకోవడం చేయడం లేదు. ఉప ఎన్నికల కోసం అదనంగా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశాం. మేం ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం. ప్రతి రోజూ నివేదికలను డీజీపీకి పంపుతున్నాం. అక్కడ నుంచి ఈసీకి వెళతాయి' అని తెలిపారు.

Next Story
Share it