Telugu Gateway
Telangana

బిజెపివి క‌ప‌ట యాత్ర‌లు..కెటీఆర్

బిజెపివి క‌ప‌ట యాత్ర‌లు..కెటీఆర్
X

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర పై మంత్రి కెటీఆర్ మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న శుక్ర‌వారం నాడు బ‌హిరంగ లేఖ రాశారు. ఇందులో బిజెపిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న లేఖ‌లోని ముఖ్యాంశాలు..'ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర... జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర.పచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా..?. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ.. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..?. పాలమూరు ఎత్తి పోతల పథకానికి జాతీయ హూదా ఎందుకు ఇవ్వలేదు?. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో ... సమాధానం చెప్పాలి?. అడుగడుగునా అన్యాయం...తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ. విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు, నీతి ఆయోగ్ చెప్పినా నిదులిచ్చే నీతి లేదు. ప్రాజెక్టులకు జాతీయ హూదా ఇవ్వరు. ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారు. పండించిన పంటలు కొనకుండా రైతను గోస పుచ్చుకుంటారు. సందు దొరికితే చాలు తెలంగాణ మీద విషం గక్కుతారు.తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బీజేపీ. కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం?. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? . రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతరా?. తు ద్రోహి.. రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనేలేదు.

తన పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అనో లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని చేసిన విజ్ఞప్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ స్పందన ఏంటో బండి సంజయ్ చెప్పాలి. పక్కనే ఉన్న కర్ణాటక అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కి జాతీయహోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదో చెప్పిన తరువాతనే పాలమూరు గడ్డ మీద బండి సంజయ్ అడుగుపెట్టాలి. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో సమాధానం చెప్పాలి? పాలమూరు రైతు చేసిన పాపం ఏంది..? పాలమూరు ప్రజల చిరకాల కోరిక అయిన గద్వాల, మాచార్ల రైల్వే లైన్ ను ఎలా పూర్తి చేస్తారో బండి సంజయ్ స్పష్టం చేయాలి. ఆదిశక్తి పీఠమైన జోగులాంబను దర్శించుకుని పాదయాత్ర ప్రారంభిస్తున్న బండి సంజయ్, రాష్ట్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలకు అదనంగా ఎన్ని నిధులను తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తెల్లారి లేస్తే రాముడి పేరుతో రాజకీయాలు చేసే నీచమైన భారతీయ జనతా పార్టీ, ఆ కోదండ రాముడు నడయాడిన భద్రాద్రి క్షేత్రానికి ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు తెలపాలి. దేవాలయాలను, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే బండి సంజయ్, భారతీయ జనతా పార్టీలది. కాని మేం మాత్రం అంచంచలమైన భక్తి, అంకుఠిత దీక్షతో ఆ సేతు హిమాచలంలోనే అద్భుతమైన దైవక్షేత్రంగా యాదాద్రిని నిర్మించాము. ఈ దైవకార్యంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఏమన్నా ఉందా? దేవుళ్లు, దైవాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రైతాంగాన్ని కూడా తన చిల్లర రాజకీయాలకు బలి చేస్తోంది.

వడ్లు వేస్తే కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తామని తెలంగాణ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి, పంట చేతికొచ్చినంక తప్పించుకు తిరుగుతున్న బండి సంజయ్ తన పాదయాత్రకు రైతు దగా యాత్ర లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. తెలంగాణ రైతాంగం ప్రస్తుతం ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితిపై బండి సంజయ్ తన వైఖరిని స్పష్టం చేసినంకనే పాదయాత్ర ప్రారంభిస్తే మంచిది. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు...ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతరా? వడ్లు కొనమని అడిగితే నూకలు తినండని తెలంగాణ ప్రజల్ని అవమానించిన దురహంకారం బీజేపీది. రైతు ద్రోహి.. రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనేలేదు. తెలంగాణ అంటేనే గిట్టని బీజేపీ నాయకులు కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం? పాదయాత్రే కాదు మోకాళ్లపై దేక్కుంటూ యాత్ర చేసినా బండి సంజయ్, భాజాపాను తెలంగాణ ప్రజలు నమ్మరు. బీజేపీ పార్టీ డిఎన్ఏ లో ఉన్న వివక్ష, విభజన రాజకీయాలను తెలంగాణ ప్రజలు గుర్తించి తిరస్కరిస్తారు.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it