Telugu Gateway
Telangana

దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం

దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం
X

విషాదం. దీక్షిత్ తిరిగి వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. గురువారం ఉదయమే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీక్షిత్ ను కిడ్నాపర్లు తీసుకెళ్లిన గంటల వ్యవధిలోనే దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న దీక్షిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గత ఆదివారం కిడ్నాపర్లు దీక్షిత్ రెడ్డిని తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తాము ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నది తెలియకుండా ఉండేందుకు వాళ్లు ఇంటర్నెట్ కాల్స్ చేశారు. తాము డిమాండ్ చేసిన విధంగా 45 లక్షల రూపాయలు ఇస్తే బాబును వదిలిపెడతామని చెప్పారు.

కానీ తమ దగ్గర అంత డబ్బులేదని చెప్పినా..కిడ్నాపర్లు పదే పదే డిమాండ్ చేశారు. చివరకు ఎంతో కష్టపడి డబ్బు సర్దుబాటు చేసి..కిడ్నాపర్లు కోరిన దగ్గరకు వెళ్లినా వాళ్ళు మాత్రం రాలేదు. కిడ్నాప్‌కు సూత్రధారుడు మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంద సాగర్‌ అనే వ్యక్తితో కలిసి బాలుడిని హత్య చేసినట్లుగా చెబుతున్నారు. మహబూబాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని గుట్టలో బాలుడి మృతదేహం లభించింది. కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశపడ్డ ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. దీక్షిత్ కోసం వంద మంది పోలీసులు గాలింపు చేపట్టారు.

Next Story
Share it