Telugu Gateway
Telangana

దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలి

దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలి
X

దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో పోలీసులు అధికార టీఆర్ఎస్ కు ఒత్తాసు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు ఉపక్రమించిన సంజయ్, రాత్రి నేలపై పడుకొని తన నిరసనను తెలిపారు. పోలీసుల తీరుపై బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తాను సిద్దిపేటకు వెళ్తే, సీపీ జోయల్ డేవిస్ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్‌కు తరలించారని ఆరోపించారు. సీపీని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

దుబ్బాకలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే, బీజేపీ గెలుపు తథ్యమని భావించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, అధికారులను ఉసిగొలిపి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. సిద్దిపేటలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, వారి బంధువుల ఇళ్లలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించారని, పోలీసులు డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆయన ఆరోపించారు. రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్‌ కోరారు. సిద్దిపేట సంఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it