Telugu Gateway
Politics

వింత ముఖ్యమంత్రి..విచిత్రమైన ప్రభుత్వం

వింత ముఖ్యమంత్రి..విచిత్రమైన ప్రభుత్వం
X

ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వింత ముఖ్యమంత్రి, విచిత్రమైన ప్రభుత్వం ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే అఖిలపక్ష్ సమావేశం ఆపాలని రాత్రికి రాత్రి హౌస్ మోషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ప్రజలు ఎక్కడ రెండు చెంపలు వాయించుతారేమో అని భయపడుతున్నారని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలసిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో సీఎం వైఎస్ జగన్ ఎస్ఈసీని సభ్యసమాజం సిగ్గుపడేలా కులం పేరుతో దూషించారని విమర్శించారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నారన్నారు. ప్రాంతాలు, కులాల మధ్య తగాదాలు సృష్టించడం, సంక్షేమం లేకపోవడంతో, ఈ సమయంలో ఎన్నికలు పెడితే దెబ్బతింటామని వైసీపీ భావిస్తోందన్నారు.

ఎన్నికలకు తాము సిద్ధమని, కేంద్ర బృందాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరామని అచ్చెన్న అన్నారు. నామినేషన్ ఆన్ లైన్‌లో ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలన్నామన్నారు. ఎన్నికల సందర్భంగా అధికారులపై తీసుకున్న చర్యలు అమలు చేయాలని కోరామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలని తెలిపామన్నారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, దౌర్జన్యానికి దిగారన్నారు. ఆ సమయంలో అధికార పార్టీ చాలా స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. అప్పుడు ఎన్నికలను వాయిదా వేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు.

Next Story
Share it