హుజూరాబాద్ ఎన్నిక తర్వాత దళితబంధు ఎందుకు ఆగింది?
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దళితులకు మేలు చేసే ఉద్దేశ్యం ఉంటే తక్షణమే దళిత బంధు అమలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత బంధు పై కిషన్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితులను మభ్య పెట్టేందుకు పథకం తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు కావడం లేదో ముఖ్యమంత్రి సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈసీ) దళితబంధును ఆపేయాల్సిదిగా ఆదేశించిన సమయంలో తెలంగాణ సీఎం కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం పరిధి దాటి వ్యవహరిస్తోందని..ఎన్ని రోజులు ఈ పథకాన్ని ఆపగలరని ప్రశ్నించారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ పథకం కింద నిధుల పంపిణీ పూర్తిగా నిలిపేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి.