Telugu Gateway
Politics

కెసీఆర్ వంగి వంగి దండాలు పెట్టినా వదిలేది లేదు

కెసీఆర్ వంగి వంగి దండాలు పెట్టినా వదిలేది లేదు
X

ముఖ్యమంత్రి కెసీఆర్ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ వంగి వంగి దండాలు పెట్టినా..పొర్లు దండాలు పెట్టినా తాము వదిలేది లేదన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. 'కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పాం. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు చావు దెబ్బ కొట్టారు. లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి. వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో 20 వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం. దోచుకోవటానికే ఇదంతా చేస్తున్నారు.

కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారు. ప్రశ్నిస్తే మా రాష్ట్రం.. మా నిధులంటారు.. రాష్ట్రం మీ అయ్య జాగీరా?' అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వరదలు వస్తే ప్రజలను పరామర్శించటానికి బయటకు రాని కెసీఆర్ నిధుల కోసం అని ఢిల్లీ వచ్చారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ రావటం తప్పు కాదని..వరదల అప్పుడు కష్టాల్లో ఉన్న ప్రజలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తాము కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు.

Next Story
Share it