Telugu Gateway
Politics

తెలంగాణ సొమ్ముతో బుల్డోజ‌ర్లు కొంటున్న యోగి

తెలంగాణ సొమ్ముతో బుల్డోజ‌ర్లు కొంటున్న యోగి
X

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటీఆర్ బిజెపి, కాంగ్రెస్ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న హ‌న్మ‌కొండ‌లో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏడున్నర ఏళ్లలో పన్నుల రూపంలో 3,65,797 కోట్లు కేంద్రానికి చెల్లిస్తే, తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల 600 కోట్లు మాత్రమేనని మండిపడ్డారు. తాను చెప్పిన లెక్క తప్పైతే మంత్రి పదవి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. తెలంగాణ రాష్ట్రం డబ్బు గుజరాత్‌, యూపీలోకి వెళ్లుతుందని అన్నారు.మోదీ పైస‌ల‌తోనే ఈ ప్ర‌భుత్వం న‌డుస్తుంద‌ని ఓ చిల్ల‌ర‌గాడు మాట్లాడుతుండని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాసుకో రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా.. త‌ప్పు అయితే నా మంత్రి ప‌ద‌విని తీసి ఎడ‌మ‌కాలి చెప్పులా ప‌డేస్తా అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌జ‌ల చెమ‌ట‌, క‌ష్టంతో సంపాదించిన డ‌బ్బుల‌ను యూపీలోని యోగి స‌ర్కారు బుల్డోజ‌ర్లు కొన‌టానికి వాడుతోంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ బీజేపీ నాయ‌కులు బుద్ధి తెచ్చుకోవాలి. నేను చెప్పింది త‌ప్ప‌యితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా. నేను చెప్పిన లెక్క త‌ప్ప‌యితే మంత్రి ప‌ద‌విని వ‌దిలిపెట్టి సాధార‌ణ ఎమ్మెల్యేగా కొన‌సాగుతా. నేను చెప్పింది త‌ప్ప‌ని ద‌మ్ముంటే బీజేపీ నాయ‌కులు రుజువు చేయాల‌ని స‌వాల్ చేస్తున్నాను. ఎవ‌డి సొమ్ముతో ఎవ‌డు కులుకుతున్నాడు? కేటీఆర్ అని ప్ర‌శ్నించారు.

టీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ తీరి యుక్త వయస్సు వచ్చిందని అన్నారు. హన్మకొండలో టీఆర్ఎస్ ప్రతినిధుల సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసిఆర్ సూపర్‌స్టార్‌, మెగాస్టార్ కాదని 46, 47ఏళ్ల వయసులోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. గుండెబలం, ధైర్యంతో సీఎం కేసీఆర్ బయలుదేరారని తెలిపారు. ప్రాణాలు తెగించి పోరాడి తెలంగాణ సాధించారని చెప్పారు. అలాంటి నాయకునిపై కుక్కల్లాగ మొరిగేవాళ్లు ఆనాడు లేరని మండిపడ్డారు. ఆనాడు టీపీసీసీ ఎక్కడిది, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఎవ‌రు అని కేటీఆర్‌ తీవ్రంగా విమర్శించారు. చిల్లరనాయాళ్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ బఫూన్‌ పార్టీ, బెకార్ నాయకులని దుయ్యబట్టారు. కరీంనగర్‌లోని ఏమీ పీకలేని బోడి సంజయ్ పాలమూరులో సంగ్రామయాత్ర చేస్తుండని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నరేంద్ర మోదీ దేశానికి కాదు, గుజరాత్‌కే ప్రధాని అని విమర్శించారు. కెసీఆర్ తెలంగాణ సాధించ‌క‌పోతే ఈ చిల్ల‌ర గాళ్ల‌కు ప‌ద‌వులు ఎక్క‌డ‌వి అని ప్ర‌శ్నించారు. తాము ప్ర‌ధాని మోడీని కూడా బ‌ట్టేబాజ్ అని తిట్ట‌గ‌ల‌మ‌ని..కానీ తాము అలా తిట్టం అన్నారు.

Next Story
Share it